ఓం శ్రీ వినాయకాయనమః

Wednesday, August 31, 2011

గణేశాయనమః * వినాయకచవితి - విజ్ఞాన సమృద్ధి * గణేశచతుర్థి సందేశం - శుక్లాంబరధరం... స్ర్తీమూర్తిగా గణనాథుడు

గణేశాయనమః

విఘ్నాలను తొలగిస్తాడు కనుక విఘ్నేశ్వరుడు. సంకటాలను హరించే వాడు కనుక హేరంబుడు. సర్వలోక రక్షకుడు కనుక లంబోదరుడు. పూర్ణజ్ఞానాన్ని ప్రసాదించి, రక్షిస్తాడు కాబట్టి శూర్పకర్ణుడు. ఇలా ఎన్నో విశేషాలకు నిలయం గణనాధుడు. వివిధ రూపాల్లో, పలు నామాలతో కైమోడ్పులందుకొనే గణేశుని పండుగ నేడు. ఆ సందర్భంగా ప్రత్యేక వ్యాసం.

దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు అయిన గణపతిని ముందుగా పూజించి తరువాతనే ఇష్టదైవాలను ప్రార్థించడం అనూచానంగా వస్తోంది. ప్రాచీనమైన దైవంగా విఘ్నేశ్వరుని భావించి ఆయనకు గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. రుగ్వేదం గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ముందుగా పూజింపదగినవాడని తెలియచేసింది. సృష్టి మొత్తాన్ని ముప్ఫై మూడు కోట్ల మంది దేవతలు వివిధ గణాలుగా విభజించారు. ఆ గణాలకు అధిపతి గణపతి అని వేదాలు నిర్దేశించాయి.

అలాగే వేదాంగాలలో ఒకటైన ఛందో శాస్త్రంలోని మగణ, భగణ, జగణ, నగణ, సగణ, రగణ, తగణ, యగణములనే అష్ట గణములకు అధిష్ఠాన దేవత గణపతి. ఆ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకు కూడా ప్రభువు. ఓంకారము అన్ని ఛందస్సులకు మొదటిదని 'ప్రణవశ్చందసామివ' అని కాళిదాసు చెప్పినట్లుగా ప్రణవనాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మ­ృతి చెప్పింది.

సర్వ శుభప్రదాత

గణపతి సర్వవిద్యాధిదేవత. ప్రణవ స్వరూపుడై, శబ్దబ్రహ్మగా, ఆనంద స్వరూపుడుగా విరాజిల్లుతున్నాడు.

జ్ఞానార్థవాచకోగశ్చ, ణశ్చ నిర్వాణవాచకః!
తయోరీశం పరబ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్!

'గ' అనే అక్షరం జ్ఞానార్థ వాచకమై, 'ణ' అనే అక్షరం నిర్వాణవాచకమై 'గణ' అనే శబ్దానికి వాక్కు అనే అర్థం ఉంది. దీనిద్వారా వాగధిపతి గణపతియే అని శాస్త్రం చెబుతుంది. శ్రీ గణేశ అనే సంస్కృత పదమునకు ప్రారంభం అని అర్థము. అందుకే వినాయకుడు ఆదిదేవుడు అయ్యాడు. గణ్యంతే బుధ్యంతే తే గణాః అన్నట్లు సమస్త దృశ్యమాన పదార్థాలు, గణాలు అన్నింటికీ అధిష్ఠానదేవత గణపతి. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు.

సమస్త విఘ్నాలను రూపుమాపి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. గణనాథుడు ఓంకార స్వరూపుడని గణపత్యధ్వర శీర్షం వర్ణించింది. స్వయంభువు అయిన మూలవిరాట్టు ఉద్భవించిన తరువాత ఆయన నుంచే ముక్కోటి దేవతలూ ఆవిర్భవించారు. దేవతా గణములు ఉద్భవించి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఆది పురుషుడుగా గణపతి పూజలందుకుంటున్నట్లు గణేశపురాణం తెలియజే స్తోంది. గణేశుడువిష్ణుస్వరూపుడని 'శుక్లాంబరధర విష్ణుం' అన్న శ్లోకం సూచిస్తుంది.

సర్వసిద్ధి ప్రదుడు, సర్వమంత్ర దేవతారూపి, విఘ్నహరుడు, ప్రణవ స్వరూపుడుఅయిన గణపతికి అనేక రూపాలున్నాయి. వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంతో పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలి వాహనంతో మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై, సంపద బొజ్జతో ఉన్న గజాననుణ్ణి ఆరాధిస్తున్నాం.

వినాయకుని సంసారం

గణపతి దివ్య ఆవిర్భావము ఒక అద్భుత సంఘటన. నలుగుపిండిని నలిచి వినాయకుడ్ని చేసి ద్వారపాలకుడిగా నిలబెట్టింది పార్వతి. ముందు వెనుకలు చూడకుండా తనను అడ్డగించినందుకు కోపించి శివుడు అతని తల తురిమేశాడు. పిమ్మట పార్వతి విచారం చూడలేక తన గణాలను పంపి ఏనుగు తల తెచ్చి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు.

సుందరతర శుభవదనుడై, అరుణకాంతితో అలరారుతూ, జ్యోతి ప్రభలతో ప్రకాశమానమైన దివ్యాకృతితో వెలుగొందుతూ ఉన్న ఆ బాలుడు బ్రహ్మ విష్ణు రుద్రాదులకు నమస్కరించి "క్షంతవ్యశ్చాప రాధోమే మానశ్చై వేదృశో నృణామ్'' అభిమాన వంతుడనై ప్రవర్తించిన అపరాధమును మన్నించమని త్రిమూర్తులను కోరతాడు. పార్వతీ దేవి ఆ బాలుని దగ్గరగా తీసుకుని గజవదనా! నీవు శుభకరుడవు, శుభ ప్రదాతవు. ఇక నుండి సమస్త దేవతలలో ప్రథమార్చన నీకే లభిస్తుందని ఆశీర్వదిస్తుంది.

ఆనాటి నుంచి ఆ గణనాథుని ప్రథమ పూజ్యుడుగా ఆరాధించడం మొదలైందనీ, జ్ఞానంతో ముక్తి మార్గమును పొందడానికి, గణేశుని ఆవిర్భావానికి తాత్త్విక సమన్వయ సంబంధం ఉందనీ శివపురాణం అత్యద్భుతంగా విశదీకరించింది. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నట్లు బ్రహ్మము అద్వయ స్వరూపశాంతియనీ, ద్వైతరూప భ్రాంతి కాదని తెలియజేయడమే గిరిజానందనుడైన గణేశుడు ఏకదంతుడవడంలోని అంతరార్థము. ప్రజాపతి తన పుత్రికలైన సిద్ధిని, బుద్ధిని గణపతికి ఇచ్చి వివాహం జరిపించాడు. సిద్ధి, బుద్ధి, గణపతులు సంతానం క్షేముడు, లాభుడు అనే వారు. కార్యసాధనలో సిద్ధి, బుద్ధితోడుగా ఉంటే లాభము, క్షేమము కలుగునని తెలియజేసే సందేశాత్మక ఆధ్యాత్మిక దృక్పథం వినాయకుని సంసారం.

ఆరాధనా ఫలం

వినాయకుని పూజించడం వల్ల శ్రీ మహాలక్ష్మీ కటాక్షము లభిస్తుందని యజ్ఞవల్క్యస్మ­ృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వ శుభాలను చేకూరుస్తుంది. త్రిపురాసురుని సంహరించేందుకు బయలుదేరినపుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధాల వల్ల ఇందుమతి రాణి గణపతి మట్టి విగ్ర హాన్ని చేసి చవితినాడు పూజించి తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగిపొందగలిగింది.

కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగముతో జన్మించినప్పటికీ గణేశుని ఆరాధించి సర్వాంగ శోభతో విరాజిల్లాడు. రుక్మాంగదుడు చింతామణి క్షేత్రంలో గణేశుని ఆరాధించి కుష్ఠువ్యాధి నుంచి విముక్తి పొందాడు. రుక్మిణీదేవి గణనాథుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయక చవితినాడు గణపతిని ఆరాధించే వారు సర్వరోగ విముక్తులై ఆరోగ్యప్రదజీవనం గడుపుతారు. సద్భుద్ధిని మేధాశక్తిని, విద్యాజయమును, అనుకూల మిత్రత్వమును, కార్య సాధననూ తక్షణమే ప్రసాదించగలడు గణనాథుడు. సర్వమూ ఆ వినాయక సమర్పితం అనే భావనతో వినాయకచవితి సభక్తికంగా జరుపుకోవాలి.

నిమజ్జనం ఆంతర్యం

తొమ్మిది రోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకువెళ్లి నీటిలో కలిపేయడం బాధాకరంగానే ఉంటుంది. కాని అది ఒక నియమం, ఒక సంప్రదాయం. నవరాత్రి ఉత్సవాలలో వినాయక విగ్రహాలను మట్టితో, ప్లాస్టిక్‌తో, పింగాణితో, రంగులతో, ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. అదే ఆలయాల్లో గానీ, ఇళ్లలో గానీ పెట్టుకునే విగ్రహాలను లోహాలతో తయారు చేస్తారు. లోహాల్లో గూడ సత్తు, ఇనుము, ఉక్కులను వాడరు.

పంచలోహ విగ్రహాలుగానీ, కంచువి, వెండివి, బంగారువి గానీ వాడతారు. అవి శాశ్వతంగా ఉంచి పూజలు చేయడానికి పనికి వస్తాయి. ఇంట్లో విగ్రహాలయితే తొమ్మిది అంగుళాలకి మించినవి వాడరాదంటారు. వాటిని రోజూ నియమ నిష్టలతో పూజించాలి. అందుకే తొమ్మిది రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి, ఎక్కడైనా ప్రవహించే నీటిలో గాని, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.

కొంతమంది 3వ రోజు, 5వ రోజులలోనే వారి వీలును బట్టి నిమజ్జనం చేస్తారు. ఆ రోజుల్లో ఇళ్లలో పెట్టిన మట్టి విగ్రహాలను కూడా నిమజ్జనానికి ఇచ్చేస్తారు. వీధి వీధిలో అట్టహాసంగా ఈ నవరాత్రి ఉత్సవాలు చేసే ఆనవాయితీ ఆంధ్రదేశంలో ఏటేటా పెరుగుతూ వస్తోంది. అయితే ఎన్నో అలంకరణలతో మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలతో నడిచే ఈ శరీరం, ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసినదే అనే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియచేస్తుంది.

- ఇట్టేడు అర్కనందనాదేవి 

వినాయకచవితి - విజ్ఞాన సమృద్ధి * గణేశచతుర్థి సందేశం
యుగయుగాలుగా దేశవిదేశాల్లోని అన్నివార్గలవారు శ్రద్ధాభక్తులతో ఒకే పద్ధతిలో జరుపుకునే విజ్ఞానభరితమైన విశేషపర్వం వినాయకచతుర్థి. ఏది మొదలుపెట్టాలన్నా, ఏ శుభకార్యంలోనైనా ముందు విఘ్నేశ్వరపూజ తప్పనిసరిగా చేస్తాం. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి అయ్యేటట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తాం.

భాద్రపద శుద్ధచతుర్థి... విఘ్నాలకు అధిపతిగా పార్వతీనందనుడు నియమింపబడిన తిథి, వినాయకుణ్ని చూసి చంద్రుడు నవ్వినందుకు పార్వతీదేవి కోపించి చంద్రుణ్ని ఎవ్వరూ చూడరాదని శపించింది. అందరూ ఆమెను ప్రార్థించగా భాద్రపద శుద్ధచతుర్థినాడు వినాయకవ్రతం చేసి, కథ విని అక్షతలు వేసుకొన్నవారు చంద్రుణ్ని చూడవచ్చునని పరిహారం చెప్పింది. అప్పటినుంచి అన్నిలోకాలలో ఈ తిథినాడు వినాయకుణ్ని పూజిస్తున్నారు.


‘గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే’ అనే వేదమంత్రం నుండి గణపతికి ప్రథమస్థానం ఏర్పడింది. జ్యేష్ఠుడుగా, బ్రహ్మకు అధిపతిగా కీర్తించబడే గణేశుణ్ని అందరికంటె ముందు పూజించాలి. ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ అని వేదశాసనం. భౌతికంగా మానవులకు ఎంతో విజ్ఞానాన్ని, సందేశాలను ఇచ్చే పండుగ ఇది ఒక్కటే.


మానవదేహంలో ఉన్న ఆరు చక్రాలలో మూలాధారచక్రం మొదటిది. దానికి అధిపతి గణపతి. పంచభూతాలలో చక్రానిది పృథివీతత్త్వం. యోగ సాధన మూలాధారం నుండి మొదలవుతుంది. భూమిపై జీవించే జీవులు గణపతి అనుగ్రహంతోనే క్రమంగా విజయాన్ని సాధించగలుగుతారు. లేకపోతే వారు చేసే కృషి ‘నేల విడిచి చేసే సాము’ అవుతుంది. మట్టిలో పుట్టి మట్టిలో మనం కలిసిపోతున్నట్లే మట్టితో చేసిన గణపతి బొమ్మను పూజించి నీటి ద్వారా మట్టిలోకి చేర్చటంలోని అంతరార్థం... రూపాన్ని పొందిన పదార్థం శాశ్వతంగా అలాగే ఉండదు అని.


సగుణోపాసన నుండి నిర్గుణపరబ్రహ్మను తెలుసుకోవాలి. ఈ పరమార్థాన్ని తెలియచేసే మట్టి ప్రతిమకు చవితినాడు పూజించాలి. మన కోరికలను అనుసరించి పూజించేటప్పుడు పసుపు, వెండి, బంగారం, నవరత్నాలతో చేసిన ప్రతిమను పూజించాలి. దానిని నిమజ్జనం చేయనక్కరలేదు. వినాయకునిరూపంలో ఎన్నోప్రత్యేకతలు ఉన్నాయి.


ఏనుగుతల దృఢదీక్షను, పెద్దచెవులు ఎదుటివారు చెప్పింది విచక్షణతో వినడాన్ని, తొండం కార్యకౌశలాన్ని, ఏకదంతం తగ్గిన అహంకారాన్ని, పెద్దనోరు ఏదైనా తినగల శక్తిని, పెద్ద పొట్ట అన్నిటినీ దాచుకోగల సామర్థ్యాన్ని, నాగయజ్ఞోపవీతం విషజంతువును యజ్ఞసూత్రంగా మలుచుకునే నిగ్రహాన్ని, నాలుగు చేతులు... చిత్తం, మనస్సు, బుద్ధి, అహంకారాలను, మూషికవాహనం చిన్నదిగా కనిపిస్తూ తనకు ఇష్టమైన దానికోసం ఎక్కడికైనా తవ్వుకుపోయే విషయవాంఛలపై అధిరోహించి తన అదుపులో పెట్టుకుని మంచిదారిలో నడిచే చాతుర్యాన్ని, వీరాసనంలో మడిచి ఉన్న ఎడమకాలు నిగ్రహించిన మనస్సును, వ్రేలాడుతున్న కుడికాలు నిర్ణయాత్మక బుద్ధిని సూచిస్తూ సాంకేతికంగా సందేశాత్మకంగా గణేశుడు రూపుదిద్దుకున్నాడు.


వినాయకచతుర్థి పూజా ద్రవ్యాలు, నైవేద్యాలు, ఆరాధనవిధానం అంతా ప్రబోధాత్మకంగా రూపొందించబడింది. మానవులు పూజించే దేవుళ్లలో నిరాడంబరతను నేర్పేవాడు గణేశుడే. నిరుపేదలైనా మట్టితో బొమ్మ చేసుకుని తోటల్లో తిరిగి, ప్రకృతి నుండి పరిసరాలలో లభించే ఏకవింశతి (21) పత్రాలను, ద్రవ్యాలను సేకరించి పూజించవచ్చు. విలువైన ఆభరణాలు, అలంకారాలు ఆయన కోరడు. పూజామందిరంలోకి అంతరిక్షంలోని పాలవెల్లిని గణపతి మాత్రమే రప్పిస్తాడు.


వడపప్పు, పానకం, ఉడకబెట్టి చేసిన ఉండ్రాళ్లు వంటి సులువుగా తయారై ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలే స్వామికి ఇష్టం. నూనెలు, నేయి, వేపుళ్లు, తీపి, కారం పిండివంటలు కోరడు. దేహానికి వ్యాయామంగా గుంజిళ్లు తీయిస్తాడు.


‘‘నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఆరోగ్యాన్నిచ్చే మూలికలు, ఓషధులు ఉన్నాయి. వర్షఋతువులో అన్నీ పచ్చగా ఉంటాయి. పిల్లల్ని తీసుకువెళ్లి వెళ్లి వెతికి వాటిని గుర్తుపట్టు. 21 రకాల ఆకులతో నన్ను పూజించు. పనికిమాలిన చెత్త తీసుకుని వచ్చి నా నెత్తిన పెట్టకు. ఓషధులలో గరిక శ్రేష్ఠమైనది. ఇది చర్మవ్యాధుల్ని పోగొడుతుంది. నాకే కాక అమ్మవారికి కూడా ప్రీతిపాత్రమైన గరికను తెచ్చి నాకు సమర్పిస్తే దోషాలు తొలగిపోతాయి.’’


ఈ పూజ ఆడంబరం కోసం కాదు, ప్రకృతితో కలసి జీవించడం కోసం. పాడిపంటల కృషి జీవనవికాసం, శారీరక, మానసిక ఆరోగ్యవిజ్ఞానం కోసం, తరాల మధ్య అంతరాలు తొలగి అనుబంధాలు పెరగటం కోసం. తల్లిదండ్రులపై గౌరవం ఇనుమడించటం కోసం. తోబుట్టువులు సఖ్యతతో ఉండటం కోసం. హాస్యరసాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రవర్తనను తీర్చిదిద్దడం కోసం. సత్రాజిత్తులా సంపదలు రాగానే అహంకరించకూడదని చెప్పడం కోసం.


భగవంతుడైనా తనపై వచ్చిన అపనిందలను తొలగించుకోవాలని తెలియటం కోసం. బుద్ధి సక్రమంగా ఉంటే నా అనుగ్రహంతో విజయసిద్ధి అవుతుందని గ్రహించటం కోసం... అని గణేశుడు వినాయకచతుర్థి ప్రయోజనాలను వరద అభయహస్తాలతో సూచిస్తున్నాడు. ఒకవేళ వ్రతం చేయలేకపోతే -
సింహః ప్రసేనమవధీత్ సింహాజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవహ్యేష శ్యమంతకః
(నిర్ణయసింధువు)
అనే శ్లోకాన్ని చదువుకుంటే చంద్రదర్శనం వలన నీలాపనిందలు రాకుండా ఉంటాయి. మొక్కుబడిగా కాకుండా, వివేకంతో విజ్ఞానాత్మకమైన వినాయకచతుర్థి వ్రతాన్ని జరుపుకుని, విద్యాసంపదను పొందుదాం. గణేశుని కృపకు పాత్రులమవుదాం.

- డా.పాలపర్తి శ్యామలానందప్రసాద్
శుక్లాంబరధరం... స్ర్తీమూర్తిగా గణనాథుడు
చిన్నా, పెద్ద ఆనందోత్సాహాలతో నిర్వహించే వినాయకచవితి హిందువులందరికీ ఎంతో ముఖ్యమైంది. నిగూఢఅర్థాలెన్నో వినాయకుడి రూపంలో దాగి ఉన్నారుు. పురాణగాధ అని కొందరు భావిస్తే, ఆరోగ్య రహస్యాలు, విశ్వరహస్యాలు దాగి ఉన్నాయని భావించే వారు మరికొందరు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా వినాయకుడికి మాత్రం ఏటేటా ప్రాచుర్యం పెరుగుతూనే ఉంది. వినాయకుడిని స్ర్తీరూపంలోనూ ఆరాధించిన దాఖలాలు ఉన్నారుు. వినాయకుడికి పెట్టే పత్రి లోనూ ఎన్నో విశేషాలున్నారుు. వీటన్నింటిపై ప్రత్యేక కథనం...

ganeshశక్తిస్వరూపుడైన గణనాథుడిని స్ర్తీమూర్తిగా కూడా ఆరాధించిన దాఖలాలు ఉన్నాయి. వినాయకి, విఘ్నేశ్వరి, గజానని...ఇలా ఎన్నో పేర్లతో స్ర్తీ మూర్తిగా వినాయకుడిని ఆరాధించినట్లుగా చెబుతారు. స్కరదపురాణం, బ్రహ్మవైవర్స పురాణాల్లో ఈ ప్రస్తావన ఉంది. మనదేశంలో క్రీ.శ 5వ శతాబ్ది నుంచి గణపతి పూజ చేస్తున్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. దేవీ సహస్ర నామాల్లో ంబోదరి, గణేశ్వరి, విఘ్నేశ్వరి అనే నామాలున్నాయి.

విభిన్న రూపాలు...
షోడశరూపాల్లో గణనాథుడిని పూజిస్తారు. జైన మతస్తులు గణేశ్వరి, వైనాయకి పేరుతోను, బౌద్ధులు గణపతి హృదయ అనే పేరుతోనూ స్ర్తీ మూర్తి ఆరాధన చేశారు. వినాయక ప్రతిమల్లో ఏనుగు ముఖం కలిగి మకుటం కలిగిన ప్రతిమను లంబోలిగా పేర్కొన్నారు.అంధకాసుర సంహారానికి పరమేశ్వరుడు జగన్మాత మాతృరూపాలను సృజించగా, వారిలో అత్యున్నత శక్తిసంపత్తి గల వినాయకి, గణేషుని పేరుతో తక్కిన మాతృగణాలకు ఆధిపత్యం వహించి రాక్షస సంహారం చేసినట్లు పురాణగాధ ఉంది. ‘గణపతి హృదయం’, ఏకముఖి, ద్విభుజి, వరదభము, నృత్యాసనమే అంటే ఏకముఖం కలిగి ద్విభుజాలతో అభయవరదాలతో నృత్యాసనంలో ఉంటుందన్న భావాన్ని కలిగిస్తూ బౌద్ధమత గ్రంథకర్తయైన అమృతానందుడు గణపతి రూపాన్ని వర్ణించాడు.

vinayaki 
గుప్తుల కాలం నుంచి విజయనగర రాజుల కాలం వరకు వైనాయకి అనేక దేవాలయాల్లో వివిధ ఆసనాలతో వివిధ భంగిమలతో రూపధారణ చేసింది. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో స్ర్తీ మూర్తి విగ్రహాలు తక్కువగా కన్పిస్తాయి. శుచీంద్రంలో చతుర్భుజిగాను, చిదంబరం పళినిలలో అర్థభాగం స్ర్తీమూర్తిగాను, అర్థభాగం వ్యాఘ్రరూపంలోనూ ఉంటుంది. క్రీ.శ. 9వ శతాబ్దికి చెందిన ఓ విగ్రహంలో వినాయకి ఏనుగును అధిష్ఠించి, కుడిచేతిలో పండును, ఎడమ చేతిలో వజ్రాన్ని ధరించినట్లుగా ఉంది. ఈ విగ్రహం ఉత్తరప్రదేశ్‌లో లభ్యమైంది. మధ్యప్రదేశ్‌లో క్రీ.శ 10వ శతాబ్దం నాటి మూషిక వాహని వినాయకి విగ్రహం లభ్యమైంది. జటామకుటధారిణిగా ఇందులో వినాయకిని చెక్కారు.

గ్వాలియర్‌ మ్యూజియంలో వినాయకి మకుటధారిణిగా, లంబోదరిగా నాలుగు చేతులతో వివిధ పాత్రలను ధరించి, త్రిభంగిలో తైత్రీయ హార శోభితంగా ఉంది. తొలికాలంలో రెండు చేతులతోను, ఆ తరువాతి కాలంలో నాలుగు చేతులతోనూ వినాయకి విగ్రహాలను రూపొందించారు. కోల్‌కతా మ్యూజియంలో పద్మాసినిగా పద్మపీఠంపై, యజ్ఞోపవీత ధారిణిగా వినాయకి విగ్రహం ఉంది. బ్రాహ్మణత్వం, రాజసత్వం కలిగి అన్ని కాలాల్లోనూ వినాయకి పూజలందుకొంది.

పత్రి పూజ...
vinayakis 
వినాయక చవితి నాడు 21 రకాల పత్రితో పూజిస్తారు. ఆ పత్రాలకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వీటిని పూజాద్రవ్యాలుగా ఉపయోగించాలని పెద్దలు సూచించారు.
  • మాచిపత్రి: దీని కషాయం దద్దుర్లు తగ్గడానికి, వ్రణాలకు వాడుతారు. తలనొప్పులకు, చర్మవ్యాధులకు పని చేస్తుంది. కళ్ళకు చలువ చేస్తుంది. పొట్టకు బలం ఇస్తుంది. మానసిక వికాసానికి తోడ్పడుతుంది.
  • బృహతీపత్రం: దీన్ని వాకుడాకు అని కూడా అంటారు. ఓ విధమైన ముళ్ళ చెట్టు ఇది. ఉబ్బు, శ్లేష్మ, క్షయ, ఉబ్బసపు దగ్గు, తాపాన్ని తగ్గిస్తుంది.బిల్వ పత్రం: దీన్నే మారేడు అని కూడా అంటారు. శివుడికి ప్రీతి. త్రిదళ పత్రి క్ష్మీ స్వరూపం. బంక విరోచనాలు తగ్గిస్తుంది. చాటలకు దీని గుజ్జు రాస్తారు. పుచ్చులు రాకుండా కాపాడుతుంది. సాధారణంగా శివాలయాల్లో ఈ పత్రాలు లభిస్తాయి.
  • గరిక: మెత్తగా నూరి గాయాలకు కడితే మానుతాయి.
  • దతుర పత్రం: నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త - దీని ఆకులకు నూనె రాసి వ్రణాలకు వాడుతారు. లైంగిక పరమైన వ్యాధులకు ఉపయోగిస్తారు.
  • బదరీపత్రం: రాగి చెట్టు ఆకులు. జీర్ణకోశవ్యాధులకు, రక్తదోషాలను హరించేందుకు ఉపయోగిస్తారు. మిరియంతో కలిపి తింటారు. ఆకుల నురుగు రాస్తే అరికాళ్ళ, అరి చేతుల మంటలు తగ్గుతాయి.
  • అపాముర్గ పత్రం: దీన్నే ఉత్తరేణి అంటారు. పంటి జబ్బులకు దీని వేర్లు ఉపయోగిస్తారు.
  • తులసీపత్రం: లక్ష్మితులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, రామ తులసి...ఇలా ఎన్నో రకాలున్నాయి. అజీర్ణం, కడుపునొప్పి, గర్భ శూల, చర్మరోగాలు, తేలుకాటులకు ఉపయోగిస్తారు. పసిబిడ్డల కు మంచిది. యాంటీసెప్టిక్‌గా కూడా ఉపయోగపడుతుంది.
  • మామిడి: మేహకారక మంటలు, రక్త అతిసారను తగ్గిస్తుంది.
  • కరవీరపత్రం: గన్నేరు అని కూడా అంటారు. దురదలు, దద్దుర్లు, గడ్డలు, కంతులు, జంతు విషాలను తగ్గిస్తుంది. చర్మరోగాలు తగ్గిస్తుంది.
  • విష్ణుక్రాంత: నీలపుష్టి అంటారు. కఫం, పైత్యం, జ్వరం, ఉబ్బులకు ఉపయోగిస్తారు. వీటి ఆకులు ఎండబెట్టి ఆకు పొగ పీలిస్తే ఉబ్బస వ్యాధులు తగ్గుతాయి.
  • దానిమ్మ ఆకు: వగురుగా ఉండి జీర్ణకోశ వ్యాధులు తగ్గిస్తుంది. మలాశయ వ్యాధులను అరిడుతుంది. నీళ్ళవిరోచనాలను తగ్గిస్తుంది. ఏలిక పాముల బెడదను తగ్గిస్తుంది.
  • దేవదారు పత్రం: లేత చిగుళ్ళు మేహశాంతిని కలిగిస్తాయి. ఆకుల తైలం కళ్ళకు చలువ చేస్తుంది.
  • హదుక పత్రం: దీన్నే మరువం అంటారు. జీర్ణశక్తిని, ఇంద్రియ పుష్టిని, ఆకలిని కలిగిస్తుంది. కేశరోగాలు తగ్గిస్తుంది. పరిమళద్రవ్యంగా ఉపయోగిస్తారు.
  • సింధూర పత్రం:వావిలాకు- జ్వరాలకు, జ్వరదోషాలకు, కీళ్ళనొప్పులు, వాపులకు వాడుతారు.
  • జాజి ఆకులు: వాతానికి, పైత్యానికి మందు. జీర్ణాశయ, మలాశయ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. నోటిపూత, కామెర్లు తగ్గించేందుకు వాడుతారు. బుద్ధి బలానికి మంచి మందు. చర్మ, కాలేయ రోగాలు, పక్షవాతం, తలనొప్పి, గవదబిళ్ళలు తగ్గిస్తుంది.
    గణక పత్రం: దీన్నే గండకి లేదా వినాయకపత్రంగా వ్యవహరిస్తారు. కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రమే లభిస్తుంది.
  • జమ్మిపత్రం: కఫం, మూలవ్యాధి, దీర్ఘకాలిక చర్మవ్యాధులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు.
  • రావిపత్రం: దీని చెక్క ఎండబెట్టి నీరు చేర్చి ద్రావణం కాచి చర్మవ్యాధులకు వాడుతారు. ఈ చెట్టు గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు. దేవతావృక్షమని అంటారు. 40 రోజుల పాటు 40 ప్రదక్షిణలు చేస్తే మంచిదని చెబుతారు.
  • అర్జున పత్రం: మద్ది చెట్టు- దీని కలపతో గృహోపకరణాలు చేస్తారు.
  • అర్కపత్రం: జిల్లేడు - దీని కాండంతో చేసిన వినాయకుడిని పూజిస్తే సకల కార్యాలు నెరవేరుతాయని అంటారు. చర్మవ్యాధులను తగ్గించేందుకు ఈ పత్రాలను ఉపయోగిస్తారు.
    - ఎన్‌. వాణీ ప్రభాకరి

No comments: